ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌లో సినిమా చూస్తూ ఓవ్యక్తి మృతి.

0
33

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌లో సినిమా చూస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన  జరిగింది.  శుక్రవారం సమంత, శర్వానంద్ జంటగా నటించిన ‘జాను’సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు అందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుంచి కదల్లేదు. దీంతో అది చూసిన థియేటర్ సిబ్బంది నిద్రపోయాడేమోనని అతడ్ని లేపేందుకు గట్టిగా కేకలు వేశారు. ఎంతగా పిలిచినా అతడు స్పందించకపోవడంతో … అనుమానం వచ్చి… దగ్గరకు వెళ్లి చూశారు.

అయితే అప్పటికే అతడు సీటులోనే మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. థియేటర్‌కు వచ్చిన ఎస్‌ఐ మహేందర్‌ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే అతడి పాకెట్లో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. గుండె పోటుతో మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.