తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య..

0
52

ఈ ప్రపంచంలో ఏబంధమైనా దొరికిపోతుందేమోకానీ… తల్లిదండ్రుల అనుబంధం, మమత, ప్రేమ మాత్రం ఒక్కసారి పోతే మళ్లీ తిరిగిరావు. అందుకే ఏ మతమైనా… ఏ కులమైన.. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని చెబుతోంది. వారిని ప్రేమించాలి, గౌరవించాలి అని చెబుతుంటారు. కని ఇప్పుడంతా కలికాలం నడుస్తోంది. కన్నవారిని పట్టించుకోని పిల్లలు కొందరైతే… బతికుండగానే కాటికి పంపిన వాళ్లు ఇంకొందరు. అయితే కొందరికి మాత్రం తల్లిదండ్రుల విలువ బాగా తెలుసు. అందుకే కొందరు పిల్లలు వారి లేకుండా బతకలేరు. తల్లి చనిపోయిందని తండ్రి చనిపోయాడాని ఆగిన కూతుళ్లు, కొడుకుల గుండెలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కూతురు కూడా తనకెందుకీ బతుకు అనుకుంది. ప్రమాదంలో తండ్రి చనిపోవడంతో… ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా కోటిపల్లిలో చోటు చేసుకుంది.

ఆరవెల్లి సాయిప్రియ అనే యువతి మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఇంకా వివాహం కూడా కాలేదు. సాయిప్రియ తండ్రి వసంత్‌ సోమవారం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వస్తుండగా జైపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వసంత్‌ను కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించి వైద్యచికిత్సలు అందిస్తుండగా మృతిచెందారు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా ఆడపిల్లల్లో సాయిప్రియ చివరి సంతానం. తండ్రి మృతదేహాన్ని అంబులెన్సులో చెన్నూరుకు తీసుకొస్తుండగా వెనుక కారులో సాయిప్రియ తన అక్కాచెల్లెళ్లతో కలిసి కూర్చొంది. దారిలో తండ్రిని తలచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.

కష్టపడి పెంచి తనను ప్రయోజకురాలిని చేసిన తన తండ్రి లేని జీవితం తనకెందుకు అనుకున్నారేమో.. కారు గోదావరి వంతెన మీదకు చేరుకోగానే.. వాంతి వస్తోందంటూ కారు ఆపాలని కోరింది. అందులోంచి దిగిన వెంటనే నదిలోకి దూకేశారు. ఓ వైపు తండ్రి మృతదేహం… మరోవైపు చెల్లెలు ఆత్మహత్యతో… కళ్లముందే జరిగిన ఈ అనూహ్య సంఘటనకు కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. గోదావరిలో తన చెల్లెలు కోసం గాలించారు. ఆమె ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.