వేడెక్కిన రాజకీయాలు. ప్రధానితో భేటీ కానున్న సింధియా

0
32

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2018 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు కూలడం తథ్యంగా కనిపిస్తోంది. గత వారం రోజుల నుంచి అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం అమిత్ షాతో కలిసి ప్రధాని నివాసానికి సింధియా చేరుకున్నారు. మోదీతో దాదాపు అరగంట పాటు చర్చించినట్టు తెలుస్తోంది.


జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతారని ఇటీవల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే సింధియా బీజేపీలో చేరడం ఖాయమవుతోంది. అదే జరిగితే మధ్యప్రదేశ్‌లోని 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది. దీంతో మరింత అసంతృప్తితో రగిలిపోతున్న సింధియా.. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు తరలివేళ్లారు. సింధియాను బుజ్జగించడానికి కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని కమల్‌నాథ్‌ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అయినా సింధియా వర్గం మొగ్గుచూపనట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు భోపాల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, సీనియర్ నేతలు వీడీ శర్మ, వినయ్ సహస్రాబుద్దే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం బీజేఎల్పీ నేతగా శివరాజ్‌సింగ్ చౌహన్‌ను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది.