యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్ది నెలల క్రితమే తాను హెచ్చరించానని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
“ప్రాణాలకు తెగించి శత్రు దేశంతో పోరాడుతున్న సైనికుల త్యాగాన్ని యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు రాజకీయానికి వాడుకోవడాన్ని చూసి, దేశప్రజలు ఛీ కొడుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, దేశ ప్రజలను జీఎస్టీ పేరుతోనూ, డీమానిటైజేషన్ పేరుతోనూ మోడీ ప్రభుత్వం అన్నీ రకాలుగా ఇబ్బందిపెట్టిందని గుర్తుచేశారు.
ఇపుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి తమ వైఫల్యాలను కప్పిబుచ్చుకునేందుకు చివరకు దేశభద్రతను ఫణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది. రాజకీయాలకంటే దేశ భద్రతే ముఖ్యమని భావించడం వల్లే ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్పై తీసుకోబోయే చర్యలకు ఎన్డీఏ సర్కారుకు పూర్తి మద్దతు తెలిపాయి. కానీ ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లేకపోవడం దురదృష్టకరం” అని విజయశాంతి తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.