చాలా మంది కంప్యూటర్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొనివుంటారు. ఇలాంటి వారి చూపు క్రమంగా మందగిస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* కంప్యూటర్ ముందు పని చేసే వారు నిత్యం కళ్లను మూసి తెరవడం వల్ల పొడి బారవు. సాధారణంగా నిమిషంలో మనం 20 సార్లు కళ్లు మూసి తెరుస్తాం. కానీ కంప్యూటర్ ముందు పనిచేసేప్పుడు ఇది దాదాపుగా సగానికి తగ్గుపోతుంది. దీంతో కన్నీరు ఆవిరిగా మారి కళ్లు పొడిబారతాయి.
* ప్రతి రెండు గంటలకొకసారి కంప్యూటర్ మీద నుంచి ఓ 15 నిమిషాలు దృష్టిమరల్చాలి. కంప్యూటర్ను మరీ దగ్గరగా కూర్చుని చూసే అలవాటు మానుకోవాలి.
* గదిలోని వెలుతురును బట్టి మీ కంప్యూటర్ కాంతిని సర్దుబాటు చేసుకోవాలి. లేదంటే కళ్లు త్వరగా అలసటకు గురవుతాయి.
* కిటికీదగ్గర కూర్చుంటే బయటి నుంచి వచ్చే సూర్య కిరణాలు తెరపై నుంచి మీ కళ్లలోకి పరావర్తనం చెందుతాయి. దీనివల్ల కళ్లు త్వరగా అలసటకు గురవుతాయి. గ్లేర్ తగ్గించే విధంగా తెరపై ఏదైనా షీట్ వంటిది పెట్టండి.
* కంప్యూటర్ తెర నుంచి కళ్లను రక్షించడానికి ప్రత్యేకంగా కళ్లద్దాలు వస్తున్నాయి. వైద్య నిపుణులను సంప్రదించి మీరు వాటిని ఎంపిక చేసుకోవచ్చు.