సుజనా చౌదరికి షాకిచ్చిన ఈడీ.. రూ.315 కోట్ల ఆస్తులు జప్తు

0
47

ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీ పేరుతో బ్యాంకులకు 364 కోట్లరూపాయలు కుచ్చు టోపీ పెట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ముఖ్యంగా, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఢిల్లీ చెన్నై బెంగళూరు‌లోని ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది. చౌదరికి సంబంధించిన షెల్ కంపెనీ నుంచి భారీగా నిధుల బదలాయింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్ల రుణం తీసుకున్న సుజనా గ్రూప్ నిధులను పక్కదారి పట్టించినట్లుగా కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సుజనా కంపెనీల్లో సోదాలు నిర్వహించిన ఈడీ బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను జప్తు చేసింది. మనీ ల్యాండరింగ్‌ 2002 చట్ట ప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. మహల్‌ హోటల్‌ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో బయటపడింది.

బీసీఈపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి సీబీఐకి అప్పగించింది. డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో బ్యాంకులను సుజనా గ్రూప్‌ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో తేలింది. చైన్నైలోని ఆంధ్రా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని షెల్‌ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది.