ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని పాండవ సైన్యంతో పోల్చగా, తెరాస కేడర్ని మాత్రం కౌరవ సైన్యంతో పోల్చారు.
ఆమె ఖమ్మంలో మాట్లాడుతూ, రాజీవ్గాంధీ 33 శాతం, సోనియాగాంధీ 50 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్లే అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి రాగలిగారని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఐదేళ్లు అధికారంలోకి ఉండి, ఈ బిల్లు పెట్టలేకపోయారని, ఇప్పుడు మళ్లీ అదే చెప్పడం మహిళలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో తెరాస అప్రజాస్వామ్య పద్ధతులకు పాల్పడుతోందని, ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా అధికారులు చూడాలని విజ్ఞప్తిచేశారు.
అభ్యర్థులు పెట్టే ఖర్చులపై లెక్కలు ఇవ్వాలని ప్రతి రోజూ అడుగుతున్న ఎన్నికల అధికారులు.. డబ్బు పంపిణీపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికలను నిజాయితీగా జరిపించాలని, డబ్బు పంపిణీ చర్యలను పోలీసులు, ఎన్నికల అధికారులు అరికట్టాలని, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగొద్దని విజ్ఞప్తి చేశారు.