దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 3 దశల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 306 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. తొలి దశలో 97 స్థానాలకు, రెండో దశలో 92, మూడో దశలో 116 సీట్లకు ఎన్నికల పోలింగ్ జరిగింది.
అయితే, మొదటి దశనుంచే ప్రజలనుంచి కమలానికి అనుకున్నంత మంచి సంకేతాలు రావడం లేదని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవల్పమెంట్ స్టడీస్ (సీఎస్డీఎస్) అంచనా. మొదటి దశలో ఎన్నికలు జరిగిన 97 స్థానాల్లో దాదాపు అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అయితే ఈ మూడు దశల్లోనూ గతంతో పోలిస్తే ఓటు శాతం పెద్దగా పెరగకపోగా, కొన్ని చోట్ల తక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో మొదటి దశలోని 8 లోక్సభా స్థానాల్లో గౌతంబుద్ధ నగర్, ఘజియాబాద్లలో మాత్రమే పోలింగ్ శాతం తగ్గింది.
మిగిలిన ఆరు లోక్సభా స్థానాల్లో గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు భారీగానే ఉన్నాయి. దీన్ని బట్టి మొదట పోలింగ్ జరిగిన యూపీలోని 8 స్థానాల్లో బీజేపీకి కేవలం రెండు స్థానాలే రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో మిగిలిన నాలుగు దశల ఎన్నికలపైనే బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకుంది.