తెలుగు చిత్ర పరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఛాన్సులు కొట్టేస్తున్న జాబితాలో ఉన్న హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు. ఈమె తాజాగా అయోగ్యా అనే తమిళ చిత్రంలో నటించింది. విశాల్ హీరో. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ కానుంది.
అయితే, ఈ చిత్రంలో రాశీ పాత్రకు రవీనా అనే యువతి డబ్బింగ్ చెప్పింది. అయితే సినిమా క్రెడిట్స్లో రవీనా పేరును చేర్చలేదు. అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్లో డబ్బింగ్ ఆర్టిస్ట్లకు క్రెడిట్స్ ఇవ్వలేదని, చాలా బాధగా ఉందని రవీనా ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ విషయంపై రాశీ ఖన్నా స్పందించారు. “రవీనా నీకు నేను క్షమాపణలు చెబుతున్నా. నీ మధురమైన స్వరంతో నా పాత్రకు డబ్బింగ్ చెప్పి నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు. దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. ధన్యవాదాలు రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.