జగన్ కళ్ళలో ఆనందం లేదు : పూరీ జగన్నాథ్

0
82

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ సింహంలా కనిపిస్తున్నాడనీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించినా ఆయన కళ్లలో ఏమాత్రం ఆనందం లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.

పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి వైఎస్సార్పీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన పూరీ జగన్నా… ఈ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు.

వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. “నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం. జగన్ ఫొటో చూసినా.. వీడియో చూసినా ఎంతో ఎక్జయిటింగ్ అవుతుంటాడు. ఉమాశంకర్ ఎందుకు ఎందుకు అలా ఫీలయేవాడో నాకిప్పుడు అర్థమైంది.

గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, జగన్ మళ్లీ ధైర్యం చెప్పి వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను రాజకీయాల్లో లేను. కానీ నాకు యోధులంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయాక ఎన్నో అవమానాలు, కష్టాలు అధిగమించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ నాకు సింహంలా కనబడుతున్నారన్నారు. జగన్‌తో తన తమ్ముడు ఉమాశంకర్ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పూరీ జగన్నాథ్ షేర్ చేశారు.