వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా పెసర బొబ్బట్లు

0
50
వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా అమ్మవారికి రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. వాటిలో పెసరపప్పు బొబ్బట్లు ఎలా చేయాలంటే…
కావలసినవి:
మైదా – ఒకటిన్నర కప్పు, పెసరపప్పు – ఒక కప్పు, చక్కెర – ఒక కప్పు, నీళ్లు – సరిపడినంత, ఉప్పు – తగినంత, నూనె, నెయ్యి – సరిపడా, యాలకుల పొడి – అర టీస్పూను.
తయారీ విధానం:
మైదా పిండిలో ఒక టేబుల్‌స్పూను నూనె, అర టీస్పూను ఉప్పు వేసి కలిపి, సరిపడా నీళ్లు పోసి మెత్తటి పిండిముద్దలా చేయాలి.
పెసరపప్పును ఉడికించి నీళ్లు ఒంపేయాలి. ఉడికిన పెసరపప్పును మెత్తగా చేయాలి.
ఒక పాత్రలో చక్కెర వేసి పెసరపప్పు మ్యాష్‌ను అందులో కలపాలి. దాన్ని స్టవ్‌ మీద సన్నని మంటపై ఉడికించాలి. దీంతో చక్కెర కరిగి పెసరపప్పులో ఇంకి చిక్కగా తయారవుతుంది.
దీంట్లో పావు టీస్పూను ఉప్పు, యాలకుల పొడి వేసి కలిపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేయాలి. అరటి ఆకు లేదా ప్లాస్టిక్‌ పేపర్‌ మీద నూనె రాసి మైదాపిండిని అరచేతి మందాన ఒత్తాలి. అందులో పెసర మిశ్రమాన్ని పెట్టి ఉండల నాలుగువైపుల నుంచి మైదాపిండిని పైకి తెచ్చి బాల్‌లా చేయాలి. ఈ ఉండల్ని చేతుల మీద నూనె రాసుకుని గుండ్రంగా ఒత్తాలి. తవాను స్టవ్‌ మీద వేడి చేసి చేత్తో ఒత్తిన బొబ్బట్లను రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేదాకా దానిపై నూనెతో కాల్చి ప్లేటులో పెట్టాలి. ఇలా చేసిన తర్వాత వాటి మీద నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.