రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లకు సుమారు 3 వేల మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు(తెలుగు, హిందీ మినహా), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రిన్సిపాళ్లు, ఎస్జీటీలు ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందనున్నాయి. డీఎస్సీ-2018 నోటిఫికేషన్కు సంబంధించి తొలివిడతలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 7,902 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రొవిజినల్ మెరిట్ లిస్టుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1900 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది.
ఈ ప్రక్రియ కూడా పూర్తికాగానే తొలివిడతలో సుమారు 3 వేల మంది అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డీఎస్సీ-2018 నోటిఫికేషన్కు సంబంధించి మిగిలిన 5 వేల టీచర్ పోస్టుల భర్తీపై, ప్రత్యేక డీఎస్సీ ద్వారా 602 ఖాళీల భర్తీకి గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్పై పలు కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. వేలాది మంది నిరుద్యోగులు ఎస్జీటీ(తెలుగు) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించి నియామకాలు పూర్తి చేయాలని వారు విద్యాశాఖాధికారులను కోరుతున్నారు.